: అక్కా అంటూ దగ్గరయ్యాడు... సహకరించ లేదని గొంతు కోశాడు... వీడిన హైందవి హత్యకేసు మిస్టరీ

ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన హైందవి (23) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె కుటుంబానికి పరిచయస్తుడైన నవీన్ కుమార్ హంతకుడని తేల్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన నవీన్, డిగ్రీ ఫస్టియర్ చదివే సమయంలో హైందని ఇంటి కింది పోర్షన్ లో అద్దెకున్నాడు. ఆ సమయంలో హైందవిని అక్కా అక్కా అని పిలుస్తూ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. నవీన్ కు సూళ్లూరు పేటకు చెందిన నరహరి అనే స్నేహితుడు ఉండగా, అతను తన గర్ల్ ఫ్రెండ్ తో కాసేపు గడిపేందుకు సహకరించాలని కోరడంతో, వారిని తన గదికి తీసుకు వచ్చాడు. ఆ సమయంలో హైందవి తన తండ్రి జయప్రకాశ్ రెడ్డితో కలసి స్కూటీపై వెళ్లేంతవరకూ వేచి వుండి, ఆపై వారిద్దరినీ గదిలోకి పంపి, మరో బైక్ తీసుకుని బయటకు వచ్చాడు.

ఈ క్రమంలో బండిలో పెట్రోలు అయిపోవడంతో నడిపిస్తూ వస్తుండగా, దారిలో హైందవి స్కూటీపై వస్తూ నవీన్ ను చూసింది. స్కూటీపై తనను ఇంటి వద్ద దించి, పెట్రోలు తెచ్చుకోమని చెప్పింది. పెట్రోలు పని ముగించుకున్న నవీన్, స్కూటీ తాళాలు తిరిగిచ్చే నెపంతో హైందవి ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే మద్యం తాగున్న నవీన్, ఇంట్లో మరెవరూ లేరని తెలుసుకుని, ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. హైందవి సహకరించకుండా తీవ్రంగా ప్రతిఘటించడంతో, బాత్ రూమ్ లోకి లాక్కెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఆమె బంగారు చైన్, చెవి దుద్దులు, మొబైల్ ఫోన్, స్కూటీ తీసుకుని పారిపోయాడు. ఈ కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకమైంది. వారిద్దరూ కలసి స్కూటీపై రావడం, నవీన్ ఒక్కడే స్కూటీపై వెళుతుండటాన్ని గమనించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నిజం కక్కించారు.

More Telugu News