: జనగామ జిల్లాలో ఆంధ్రజ్యోతి ఆఫీసుపై టీడీపీ నేత దాడి

తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని ఆరోపిస్తూ, ఆంధ్రజ్యోతి జనగామ జిల్లా కార్యాలయంలోకి ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ పులిస్వామి, విధుల్లో ఉన్న జర్నలిస్టు అబ్దుల్ ఖాదర్ పై హత్యాయత్నం చేయడంతో పాటు, ఆఫీసును ధ్వంసం చేశారు. ఖాదర్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పులిస్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 20వ తేదీన '‘ఆర్డీవోతో పాటు నలుగురిపై కేసుకు కోర్టు ఆదేశాలు' అనే శీర్షికన ఓ కథనం ప్రచురితమైంది.

ఈ కేసులో పులిస్వామి కూడా ఉన్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన, ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడికి దిగాడు. ఖాదర్ ను తిడుతూ, గొంతు పట్టుకుని నులిమాడు. అతని సెల్ ఫోన్ ను ధ్వంసం చేశాడు. ఆపై ఫర్నీచర్ ను ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాలు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు కార్యాలయాన్ని సందర్శించి, జరిగిన ఘటనను ఖండించారు. కేసును విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News