: ప్రార్థనలకు ముందు ఈ మంత్రాన్ని ఐదుసార్లు జపించండి.. చైనా పీడ విరగడైపోతుంది... ఆర్ఎస్ఎస్ సరికొత్త అస్త్రం!

మీరు హిందు, ముస్లిం.. ఎవరైనా కానీయండి.. ఈ మంత్రాన్ని మీ ప్రార్థనలకు ముందు ఐదుసార్లు జపించండి.. చైనా పీడ విరగడైపోతుంది.. అంటోంది ఆరెస్సెస్. భారత్-చైనా మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, డ్రాగన్ కంట్రీ కయ్యానికి కాలుదువ్వుతుండడంతో దేశ ప్రజలకు చైనాపై అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. రోజువారీ వ్యవహారాల్లో చైనా వస్తువులను తమకు తెలియకుండానే వాడేస్తున్న భారతీయులు చైనీయులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల నుంచి వాటిని దూరం చేసి చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే ప్రజలు తమ ప్రార్థనలకు ముందు తాము చెప్పిన మంత్రాన్ని ఐదుసార్లు జపించాలని కోరింది.

కైలాశ్, హిమాలయా ఔర్ టిబెట్ చీన్ కీ అసురీ శక్తి సే ముక్తి హో (కైలాశ్, హిమాలయాలు, టిబెట్‌ను చైనా కబంద హస్తాల నుంచి విడిపించు) అనే మంత్రాన్ని విధిగా ఐదుసార్లు జపించాలని కోరింది. ఇది చైనా మూల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని, తద్వారా అనుకున్న ఫలితాలు వస్తాయని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ తెలిపారు. చైనాను ఇప్పటికే అన్ని దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్న ఆయన చైనా వస్తువులను బహిష్కరించి ప్రజల్లో స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచగలిగితే చైనా పని అయిపోయినట్టేనని అభిప్రాయపడ్డారు.

More Telugu News