: కశ్మీర్ లో పోలీసులు, సైనికుల మధ్య బాహాబాహీ... పోలీసులపై సైనికుల దాడి!

తమ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద నిలిపేశారని ఆరోపిస్తూ, సైనికులు పోలీసులను చితకబాదిన ఘటన శ్రీనగర్ లో జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులకు గాయాలు కాగా, సైనికులపై కేసు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు. అమర్ నాథ్ యాత్రకు భద్రతగా వెళ్లిన జవాన్లు కొందరు సివిల్ డ్రస్ లతో బల్తాల్ బేస్ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో వెనక్కు బయలుదేరిన వేళ, ఈ ఘటన జరిగింది. సోనామార్గ్ సమీపంలోని చెక్ పోస్టు వద్ద సైనికుల వాహనాలను అక్కడ తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, వారు వాహనాలు ఆపకుండా గందర్ బల్ వైపు వేగంగా దూసుకెళ్లారు.

దీంతో వీరు ఉగ్రవాదులు అయ్యుండవచ్చన్న అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వివాదం చెలరేగగా, తమను అడ్డుకున్నారన్న కోపంతో సైనికులు గుండ్ పోలీసు స్టేషన్ లోనికి చొచ్చుకుపోయి, అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులను కొడుతూ, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర సామాన్లను పగులగొట్టారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News