: ప్రకృతి ప్రతికూలతల్లో పని చేసే సైనికులకు శుభవార్త!

ప్రకృతి ప్రతికూలతల మధ్య పని చేసే వీర జవాన్లకు డీఆర్డీవో శుభవార్త వినిపించింది. ప్రకృతి ప్రతికూలతల్లో పని చేస్తున్న తమకు నాసిరకమైన భోజనం పెడుతున్నారంటూ తేజ్ బహదూర్ యాదవ్ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవో మంచు కొండల్లో, లోయల్లో, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రాల్లో విధులు నిర్వర్తించే భద్రతా బలగాల కోసం సరికొత్త ఆహార పదార్థాలను తయారు చేసింది.

గతంలో ఆర్మీకి ఇస్తున్న ఆహార పదార్థాల స్థానంలో డీఆర్డీవో మాంసకృత్తులు అధికంగా ఉండే మటన్‌ బార్, చికెన్‌ బిస్కెట్, బడలికను పోగొట్టే తులసీ బార్‌ లను అభివృద్ధి చేసింది. కేవలం ఇవే కాకుండా పోషకాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాల బార్‌ లు, కోడిగుడ్డు ప్రొటీన్‌ బిస్కెట్లు, ఇనుము–ప్రొటీన్ల ఫుడ్‌ బార్‌ లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే చాక్లెట్, చికెన్‌ కట్టీ రోల్స్‌ లను కూడా సరికొత్తగా అభివృద్ధి చేసిందని లోక్‌ సభలో రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్‌ తెలిపారు. పెద్ద మొత్తంలో వీటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ సంస్థలకు ఒప్పందాల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. తద్వారా ప్రకృతి ప్రతికూలతల్లో పని చేసే సైనికులకు సరైన ఆహారం అందించాలన్న లక్ష్యం వేగంగా నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

More Telugu News