: వివాదంలో ఇరుక్కున్న బన్నీ.. తమిళ అభిమానుల ఆగ్రహం!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. గతంలో ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అంటూ పేర్కొని పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన స్టైలిష్ స్టార్... తన కెరీర్ లో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ జోరులో భారత్ లో ఆదరణ పొందుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌ లో ఒక జట్టును రామ్ చరణ్ తేజ్ తో కలిసి సొంతం చేసుకున్నాడు. ‘తమిళ తలైవార్’ టీంను సొంతం చేసుకున్న అల్లు అర్జున్, రామ్‌ చరణ్ తేజ్ తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా కమలహాసన్‌ ను నియమించారు. ఈ నేపథ్యంలో, జట్టు ప్రమోషన్ కోసం ఈ ముగ్గురూ కలిసి చెన్నైలో జట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అయితే వేదికపై కమలహాసన్, రామ్ చరణ్ తేజ్ మామూలుగానే కూర్చున్నారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇది తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కమలహాసన్ లాంటి దిగ్గజ నటుడి ముందు అల్లు అర్జున్ కాలు మీద కాలేసుకుని కూర్చునేంత పెద్ద నటుడైపోయాడా? అంటూ మండిపడుతున్నారు. లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే... అల్లు అర్జున్ అలా కూర్చోవడమేంటి? సీనియర్లకు గౌరవం ఇవ్వడం కూడా తెలియదా? అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

 ఇది చాలా చిన్న విషయమే అయినా, అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని సూచిస్తోందని వారు మండిపడుతున్నారు. అసలే తమిళులకు భాష, ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువ. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. గతంలో పవన్ పై 'చెప్పను బ్రదర్' వివాదం నేపథ్యంలో బన్నీ సినిమాలు ఏవి విడుదలైనా సోషల్ మీడియాలో డిస్ లైకులు వెల్లువలా వస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News