: తరగతి గదిలో హెల్మెట్స్‌ ధరించి పాఠాలు చెబుతున్న మెదక్ జిల్లా టీచర్లను చూడండి!

పాఠాలు చెప్ప‌డానికి టీచ‌ర్లకి ఓ పుస్త‌కం, బ్లాక్‌ బోర్డ్, చాక్‌పీస్ వంటికి అవ‌స‌ర‌మ‌వుతాయి. పిల్ల‌ల్ని అదుపుచేయ‌డానికి ఒక్కోసారి చేతిలో క‌ర్ర ప‌ట్టుకుంటారు. కానీ క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు చెప్ప‌డానికి టీచ‌ర్లు హెల్మెట్స్ ధరించాల్సి వ‌స్తున్న ఘ‌ట‌న మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల‌కొంది. ఆ పాఠ‌శాల‌లోని టీచ‌ర్లు హెల్మెట్ ధ‌రించి పాఠాలు చెబుతున్న దృశ్యాలను జాతీయ మీడియా ఛానెళ్లు సైతం ప్రసారం చేస్తున్నాయి. ఆ పాఠ‌శాల‌లో అటువంటి దుస్థితి వ‌చ్చింద‌ని పేర్కొంటున్నాయి. ఇంత‌కీ ఆ టీచ‌ర్లు ఎందుకిలా చేస్తున్నారంటే తరగతి గదుల్లోని సీలింగ్ ఇటీవల కురిసిన వర్షాలకి తడిసి ప్లాస్టరింగ్ పెచ్చులుగా రాలి మీద ప‌డుతోంది. దీని నుంచి రక్షించుకోవడానికే అలా చేస్తున్నారు.

ఒక్కోసారి వర్షం ఎక్కువ‌గా ప‌డితే క్లాస్ రూమ్ లో నీరు ప‌డుతోంది. గత మూడేళ్లుగా తాము ప‌డుతున్న బాధ‌ల గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ స‌మ‌స్య‌ తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండాపోతోంద‌ని ఆ పాఠ‌శాల విద్యార్థులు, టీచ‌ర్లు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. టీచ‌ర్లు హెల్మెట్‌లు పెట్టుకుని ఎలా విధులు నిర్వ‌ర్తిస్తున్నారో మీరూ చూడండి...

More Telugu News