: సిట్ ఆఫీసులోనే 26న చార్మి విచారణ... భారీ బందోబస్తు కావాలని కోరిన ఎక్సైజ్

ఈ నెల 26వ తేదీన హీరోయిన్ చార్మిని నాంపల్లిలోని అబ్కారీ భవన్ లోనే విచారించనున్నామని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేశాయి. తాను ఎక్సైజ్ ఆఫీసుకు రాలేనని గతంలో చార్మి వెల్లడించగా, మరో చోటును ఎంపిక చేసి ఆమెను విచారించనున్నట్టు తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కేసులో ఆమె ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో, ఆమెను కూడా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఫిఫ్త్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్న సిట్ కార్యాలయంలోనే విచారించాలని అధికారులు నిర్ణయించారు.

ఇక చార్మి సైతం ఇక్కడికే వచ్చేందుకు అంగీకరించారని సిట్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రేపు చార్మి విచారణకు రావాల్సి వుండగా, ఆమె విన్నపం మేరకు తేదీని 26కు మార్చి, ఆ రోజు విచారణను ఎదుర్కోవాల్సిన తరుణ్ ను రేపు రావాలని అధికారులు ఆదేశించారు. ఇక 26వ తేదీన తమకు భారీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. చార్మి వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో రావచ్చని, శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు.

More Telugu News