: రైళ్లలో అందిస్తున్న ఆహారాన్ని మనిషనేవాడు తినలేడు... కాగ్ విస్తుపోయే నివేదిక!

రైల్వే క్యాటరింగ్ సేవలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నేడు (శుక్రవారం) ఈ నివేదిక పార్లమెంటు ముందుకు రానుంది. రైళ్లలో అందిస్తున్న ఆహారం అసలు మనిషనేవాడు తినలేడని నివేదిక పేర్కొంది. కలుషిత ఆహారం, రీసైకిల్ చేసిన ఆహార పదార్థాలు, కాలదోషం పట్టిన సీసాలు, ప్యాక్‌లలో ఆహారం అందిస్తున్నట్టు వివరించింది. అలాగే గుర్తింపు లేని బ్రాండ్ల వాటర్ బాటిళ్లను స్టేషన్లలో విక్రయిస్తున్నట్టు తెలిపింది. కేటరింగ్ విధానంలో తరచూ మారుతున్న విధానాల్లోనే తప్పు ఉన్నట్టు ఆడిట్ గుర్తించింది. విధానాలు తరచూ మారుతుండడం వల్ల క్యాటరింగ్ సేవల్లో అనిశ్చితి నెలకొన్నట్టు తేల్చింది.

తాము నిర్వహించిన తనిఖీల్లో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించలేదని పేర్కొంది. ఆర్డర్ చేసిన ఆహారానికి బిల్లులు కూడా ఇవ్వడం లేదని వివరించింది. కాగ్ తమ తనిఖీల్లో భాగంగా 74 రైల్వే స్టేషన్లలో 80 రైళ్లలో ఆహారాన్ని పరీక్షించింది. స్టేషన్లలో శుద్ధిచేయని నీళ్లు సరఫరా అవుతున్నాయని, చెత్త డబ్బాలపై మూతలు పెట్టడం లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఆహార పదార్థాలపై మూతలు ఉండడం లేదని, దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు తదితరాలు వాటి పైనుంచే తిరుగుతున్న విషయం తమ ఆడిట్‌లో బయటపడినట్టు కాగ్ తెలిపింది.

More Telugu News