: ఉద్రిక్తతల నడుమ... చైనాకు వెళ్లనున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్!
ఒక పక్క చైనాతో సరిహద్దు వివాదం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని ఉత్కంఠకు గురవుతున్నారు భారత ప్రజలు. మరోపక్క బీజింగ్లో జరగబోయే బ్రిక్స్ రక్షణ సలహాదారుల సమావేశానికి హాజరవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. వచ్చేవారం అజిత్ దోవల్ బ్రిక్స్ సమావేశం కోసం బీజింగ్ వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బొగాలే తెలిపారు. జూలై 26-27 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈలోగా భారత్ చైనా సరిహద్దు వివాదం సద్దుమణిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో చైనాతో ప్రత్యక్షంగా చర్చించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. కానీ అంతకన్నా ముందు ఇరుదేశాలు తమ సైన్యాలను సరిహద్దుల నుంచి వెనక్కి పిలిపించాలని షరతులు విధించింది. ఇదిలా ఉండగా బ్రిక్స్ రక్షణ సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా రక్షణ సలహాదారు యాంగ్ జైచీల మధ్య ఎలాంటి అధికారిక భేటీ కొనసాగదని చైనా అధికారులు స్పష్టం చేశారు.