: 'పారితోషికంగా కోట్లు తీసుకునే పూరీ, వేల కోసం డ్రగ్స్ వ్యాపారమా? నమ్మబోనంటున్న' మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న

ఎప్పుడో డ్రగ్స్ వాడుంటే, ఆ కేసును ఇప్పుడు నిరూపించి, శిక్షలు విధించేలా చూడటం అసాధ్యమైన పనేనని మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న అభిప్రాయపడ్డారు. పూరీ జగన్నాథ్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఆయన, ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఒక్కో సినిమాకు ఆయన మూడు కోట్ల వరకూ తీసుకుంటున్నారని తెలుస్తోందని, అనధికారికంగా అది ఇంకా ఎక్కువే ఉండవచ్చని అన్నారు. పారితోషికంగా కోట్లు తీసుకునే ఆయన, వేలు, లేదా లక్షల కోసం డ్రగ్స్ వ్యాపారం చేస్తారన్న మాటలను తాను నమ్మబోనని వ్యాఖ్యానించారు. ఆయన డ్రగ్స్ వాడితే వాడి ఉండవచ్చని, వాడకపోయీ ఉండచ్చని, ఆ విషయంలో తనకు సమాచారం లేకున్నా, సాలీనా కోట్లు సంపాదించే వ్యక్తి, డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చే తప్ప, వ్యాపారం చేస్తారని అనుకోవడం లేదని అన్నారు.

ఓ కథను అమ్ముకున్నా, ఐడియాను అమ్ముకున్నా ఆయనకు కోట్లలో డబ్బు దక్కే పరిస్థితులున్న నేపథ్యంలో ఈ లక్షకు, రెండు లక్షలకు కక్కుర్తి పడి డ్రగ్స్ దందాను చేశారంటే ఎవరూ నమ్మరని అన్నారు. అయితే, ఆయన డ్రగ్స్ తీసుకుంటూ వేరే వాళ్లకు ఎవరికైనా ఇచ్చుంటే మాత్రం అది నేరమవుతుందని, ఆ విషయం విచారణలో తెలుస్తుందని అన్నారు. ఇక డ్రగ్స్ అమ్మకాలు చెక్కుల ద్వారా జరుగుతాయని కూడా తాను భావించడం లేదని, డ్రగ్స్ కోసం రూ.4,30,021 చెక్కును ఎవరూ ఇవ్వరని, ఏ ఈవెంట్ మేనేజ్ కోసమో పూరీ జగన్నాథ్ దీన్ని కెల్విన్ కు ఇచ్చి వుండవచ్చని అన్నారు. ఇల్లీగల్ దందాలన్నీ నగదు రూపంలోనే సాగుతాయని చెప్పారు. డ్రగ్స్ వాడుతున్నాడని నిర్థారణ అయినా, అతని వద్ద నామమాత్రంగానైనా మత్తుమందులు దొరకకుంటే అతన్ని ఏమీ చేయలేరని రెడ్డన్న వెల్లడించారు.

More Telugu News