: ఆసీస్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. గెలిస్తే ఫైనల్‌కే!

రెండు మ్యాచ్‌లు.. కేవలం రెండే మ్యాచ్‌లు.. ప్రపంచకప్ కొట్టుకు రావడానికి మిథాలీ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు. న్యూజిలాండ్‌పై ఘన విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా అదే ఊపును నేడు (గురువారం) ఆస్ట్రేలియాతో జరగనన్న మ్యాచ్‌లోనూ ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. ఆరుసార్లు ప్రపంచకప్ ఎగరేసుకుపోయిన ఆసీస్‌ను చిత్తుచేసి భారత్‌కు అపూర్వ విజయం సాధించిపెట్టాలని పట్టుదలగా ఉంది. స్టార్ ప్లేయర్లతో బలంగా ఉన్న ఆసీస్‌కు, కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న మిథాలీ సేనకు మధ్య డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగే ఈ సెమీస్ పోరు ప్రేక్షకులకు పసందైన విందు కాబోతోంది.

 ఆరుసార్లు విశ్వవిజేత, ప్రపంచ నంబర్ వన్ అయిన ఆసీస్‌ను ఢీకొడుతున్న భారత్ అందుకు తగ్గ వ్యూహాలు రచించే పనిలో పడింది. న్యూజిలాండ్‌పై భారీ విజయం దక్కడం మిథాలీ సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసినా ఆసీస్‌పై భారత్‌కు ఉన్న రికార్డు కలవరపెడుతోంది. భారత్-ఆసీస్ ఇప్పటి వరకు 42 సార్లు తలపడగా టీమిండియా 34 సార్లు పరాజయం పాలైంది. అయితే రికార్డులతో పనిలేకుండా ఆడి సత్తా చాటాలని భారత జట్టు భావిస్తోంది. 2005 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరి ఆసీస్ చేతిలో ఓడిన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

More Telugu News