: దక్షిణ భారత దేశంలో వెంకయ్యనాయుడు అంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు: సీఎం చంద్రబాబు

దక్షిణ భారత దేశంలో వెంకయ్యనాయుడు అంత గొప్ప వ్యక్తి మరొకరు లేరని, అటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి దక్కనుండటం చాలా సంతోషమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆయనకు మనస్ఫూర్తిగా తన శుభాకాంక్షలు చెబుతున్నానని, ఆయన ఏ పదవిలో వున్నా ఆ పదవికి వన్నె తెస్తారని అన్నారు.

చాలా మంది రాజకీయనాయకులను తాను చూశానని, అయితే, నిరంతరం పని చేయాలనే తపన ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడని, ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా, వాటిపై ఆయన పోరాడేరే తప్పా, వెనుదిరిగి చూడలేదని అన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెంకయ్యనాయుడు ప్రవేశించిన తర్వాత పట్టుదలతో హిందీ నేర్చుకున్నారని, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ..ఒక లీడర్ గా ఎదిగిన వ్యక్తి వెంకయ్యనాయుడని ప్రశంసించారు. రేపు వెంకయ్యనాయుడు నామినేషన్ వేయనున్నారని, ఈ కార్యక్రమానికి తాను హాజరుకానున్నట్టు చంద్రబాబు చెప్పారు. 

More Telugu News