: పెళ్లయిన వాడ్ని నేను బచ్చా అయితే.. మరి పెళ్లి కాని మీ రాహుల్ సంగతేంటి?: కేటీఆర్ కౌంటర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిని తప్పుపట్టడం కాంగ్రెస్ వారికి బాగా అలవాటైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రకంగా చూస్తే తెలంగాణ అభివృద్ధికి మొదటి శత్రువు కాంగ్రెసే అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన తెరాస విద్యార్థి విభాగ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉస్మానియా విద్యార్థులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, వారి త్యాగాల వల్లే తెలంగాణ సాధించుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. ఒక పక్క జ్ఞానార్జన చేస్తూ మరోపక్క ప్రజల కోసం పాటుపడుతూ విద్యార్థులు ముందుకు వెళ్లాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన తెలిపారు.
అలాగే కాంగ్రెస్ నేతలు అన్న మాటల గురించి మాట్లాడుతూ - `పెళ్లైన నేను బచ్చా అయితే ఇంకా పెళ్లి కాని మీ రాహుల్ గాంధీ ఏమవుతారు?` అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ వ్యయం విషయంలో కాంగ్రెస్ వారు అడుగుతున్న ప్రశ్నలకు తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ సమాధానమిచ్చారు. అధికారంలో ఉన్నపుడు ఒక్క చిత్తూరు జిల్లా నీటి అవసరాల కోసమే రూ. 9వేల కోట్లు ఖర్చుపెట్టిన కాంగ్రెస్ వారు ఈనాడు తెలంగాణలోని 31 జిల్లాల కోసం ఖర్చుపెడుతున్న రూ. 40వేల కోట్ల గురించి ప్రశ్నించడమేంటని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.