: కదులుతున్న రైలులో సెల్ఫీ... విద్యార్థి మృతి

సెల్ఫీ స‌ర‌దాకి మ‌రో యువ‌కుడు బ‌లి అయ్యాడు. గుంటూరులోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కాలేజీలో చివ‌రి సంవ‌త్స‌రం విద్యార్థి డి.గోపిరెడ్డి (21) తన మిత్రులతో కలిసి విశాఖ‌ప‌ట్నంలోని అరకు లోయను చూడ‌డానికి వెళ్లాడు. క‌దులుతున్న రైలులో సెల్ఫీ తీసుకుందామ‌ని ప్ర‌య‌త్నించి, పట్టుతప్పడంతో 150 అడుగుల లోతులో నదిలోని బండరాయిపై ప‌డ్డాడు. దీంతో ఆ విద్యార్థి అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. కరకవలస, సిమిలిగూడ స్టేషన్ల మధ్య గోస్తనీ నది ప్రవహించే చోట ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

దీంతో అత‌డి స్నేహితులు రైలు చైన్ లాగారు. అయితే, ఆ రైలు అప్ప‌టికే రెండు కిలోమీట‌ర్ల దూరం వెళ్లిపోయింది. విషయాన్ని తెలుసుకున్న‌ డ్రైవర్‌ అధికారులకు సమాచారం ఇచ్చి, రైలును వెనక్కి తీసుకొచ్చాడు. గోపిరెడ్డి మిత్రులతో పాటు కొంద‌రు ప్ర‌యాణికులు, రైలు డ్రైవర్ కలసి గోపిరెడ్డి మృత‌దేహం ప‌డిపోయిన చోటుకి వెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

More Telugu News