: సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 55 మంది ఎంపీలు.. యూపీ, గోవా సీఎంలు కూడా!

మరో రెండు గంటల్లో రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే సహేతుకమైన కారణం ఉంటే ఎంపీలు పార్లమెంటులో కాకుండా వారి సొంత రాష్ట్రాల్లోని అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.

అయితే ఇందుకోసం ఎన్నికల కమిషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో 55 మంది ఎంపీలు ఈ వెసులుబాటును ఉపయోగించుకుని తమ సొంత రాష్ట్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న ఎంపీల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పారికర్ (వీరు ముఖ్యమంత్రులుగా ఎంపికైనప్పటికీ, ఇంకా పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోలేదు) తదితరులు ఉన్నారు. అలాగే ఐదుగురు శాసనసభ్యులు పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతి తీసుకున్నారు.

More Telugu News