: ఇరాక్‌లో అపహరణకు గురైన భారతీయులు జైలులో ఉన్నారు.. భయం వద్దు.. విడిపించి తీసుకొస్తాం: సుష్మ భరోసా

ఇరాక్‌లోని మోసుల్ నుంచి 2014లో అపహరణకు గురైన 39 మంది నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం కలుసుకున్నారు. అపహరణకు గురైన భారతీయులు మోసుల్ సమీపంలోని జైలులో ఉన్నట్టు సమాచారం అందిందని, త్వరలోనే వారిని విడిపించి తీసుకొస్తామని వారికి హామీ ఇచ్చారు. కిడ్నాపైన భారతీయులు బాదుష్ జైలులో ఉన్నట్టు తెలుస్తోందని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్, ప్రభుత్వ దళాల మధ్య పోరాటం కొనసాగుతోంది.

ఈనెల 24న ఇరాక్ విదేశాంగ మంత్రి ఇబ్రహీం అల్ జఫారీ భారత్‌లో పర్యటించనున్నారని, భారతీయుల గురించి ఆయన మరింత సమాచారం మోసుకొస్తారని సుష్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చెర నుంచి మోసుల్‌కు విముక్తి లభించిన తర్వాత కేంద్రమంత్రి వీకేసింగ్‌ను ఇరాక్ పంపించినట్టు ఆమె వివరించారు.

బాధిత కుటుంబాలను తాను ఇదివరకే పది పన్నెండు సార్లు కలిశానని పేర్కొన్న సుష్మ ఈసారి మాత్రం పరిస్థితి వేరన్నారు. మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రధాని ప్రకటించారని, ఆ వెంటనే అక్కడ అపహరణకు గురైన భారతీయుల గురించి తెలుసుకునేందుకు వీకేసింగ్‌ను ప్రభుత్వం ఇరాక్‌కు పంపినట్టు వివరించారు.

More Telugu News