Sai: సాయిపల్లవితో మూడు సినిమాల కాంట్రాక్ట్!

గతంలో ఒకే ఆర్టిస్టుని కొన్ని సంస్థలు రెండు మూడు సినిమాల కోసం ఒకేసారి బుక్ చేసుకునేవి. అలా కాంట్రాక్టు చేసుకున్న తారలు జయాపజయాలతో సంబంధం లేకుండా పెద్ద మొత్తంలో పారితోషికాన్ని కూడా పొందేవారు. ఇటీవలి కాలంలో సినిమా సినిమాకీ హీరోయిన్లను మార్చేస్తుండడంతో ఈ సిస్టం కనపడడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం 'ప్రేమమ్' బ్యూటీ సాయి పల్లవిని ఒకేసారి మూడు సినిమాలకు బుక్ చేసుకోవడం టాలీవుడ్ లో విశేషంగా చెప్పుకుంటున్నారు.

తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాకి ఆమెను బుక్ చేసినప్పుడే భారీ మొత్తం ఆఫర్ చేసి, ఆమెతో మూడు సినిమాల కాంట్రాక్టును సదరు నిర్మాత చేసుకున్నాడట. తాజాగా నాని హీరోగా ఆయన నిర్మించే 'మిడిల్ క్లాస్ అబ్బాయి' (ఎంసిఏ) చిత్రంలో కూడా సాయి పల్లవి నటిస్తుంది. అలాగే, దిల్ రాజు సినిమా కర్మాగారం నుంచి త్వరలో మరో సినిమా కూడా రానుంది. ఇందులో కూడా సాయిపల్లవి నాయికగా నటిస్తుందట. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల, సతీష్ వేగేశ్న, దశరథ్ లలో ఒకరు దర్శకత్వం వహిస్తారు.    

More Telugu News