: చైనా, పాక్ లతో ముప్పు... డిఫెన్స్ కు రూ. 27 లక్షల కోట్లు ఇస్తేనే నిలుస్తాం: కేంద్రానికి స్పష్టం చేసిన రక్షణ శాఖ

ఇరుగు, పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనాల నుంచి భారత దేశానికి ముప్పు పెరుగుతున్న వేళ, రక్షణ రంగానికి వచ్చే ఐదేళ్లలో రూ. 27 లక్షల బడ్జెట్ ను కేటాయించాలని ఆ శాఖ కోరింది. ఏకీకృత రక్షణ పథకం కింద 2022 లోగా 416 బిలియన్ డాలర్లు అవసరమని తేల్చి చెప్పింది. డీఆర్డీఓ సహా వివిధ రంగాల ప్రతినిధులు యూనిఫైడ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొని రక్షణ రంగానికి 13వ పంచవర్ష ప్రణాళిక రిపోర్టును ప్రభుత్వానికి పంపారు.

దీనికి ప్రణాళికా సంఘం ఆమోదం పలికితే, మరింత అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలు, నౌకల సమీకరణ, ఆయుధాల ఆధునికీకరణ విషయంలో ముందడుగు వేయాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఇక ఈ సదస్సులో పాల్గొన్న రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, సైనిక దళాలకు కొత్త నిధులపై ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ. 1.72 లక్షల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, వాటిల్లో రూ. 86 వేల కోట్లకు పైగా కొత్త ఆయుధాలకు వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 1.56 శాతమేనని, దీన్ని 2 శాతం వరకూ పెంచేందుకు యోచిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.

More Telugu News