: పీహెచ్‌డీ విద్యార్థినిపై 'ఐఐటీ' భువనేశ్వర్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ముఖ్యమంత్రికి, ప్రధాని మోదీకి బాధితురాలి లేఖలు!

ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఓ విద్యార్థిని తన ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన విద్యార్థిని ప్రొఫెసర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2012లో తాను వివాహం చేసుకున్నప్పటి నుంచి ప్రొఫెసర్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లాయర్ ద్వారా ఐఐటీ డైరెక్టర్‌కు నోటీసు పంపింది. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌, ప్రధాని నరేంద్రమోదీలకు లేఖ రాస్తూ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. విద్యార్థిని ఆరోపణలపై స్పందించిన నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్య విభాగ డిప్యూటీ సెక్రటరీ పీకే సరంగి వెంటనే నివేదిక కావాలని ఐఐటీ డైరెక్టర్‌ను ఆదేశించారు.

2012నుంచి ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, భర్త నుంచి తనను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత విద్యార్థిని ఆరోపించింది. ప్రొఫెసర్ వేధింపుల ఫలితంగా తన భర్త మానసిక వేదనకు గురయ్యారని పేర్కొంది. బ్రెయిన్ హేమరేజ్ (మెదడులో రక్తస్రావం)తో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బాధిత విద్యార్థిని బెంగళూరులో ఉంటున్నారు. ఈ విషయమై ఐఐటీ భువనేశ్వర్ రిజిస్ట్రార్ దేవరాజ్ రథ్ మాట్లాడుతూ విద్యార్థిని ఫిర్యాదులో నిజం లేదని, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విచారణలో ఆమె ఆరోపణలు వీగిపోయాయని పేర్కొన్నారు.

More Telugu News