: ‘నారాయణ్‌పేట్‌ లాంటి గ్రామంలో ఓ పిల్లాడు ఉండే వాడు’ అంటూ క‌థ చెప్పిన కేటీఆర్‌!

'నారాయణ్‌పేట్‌ లాంటి ఓ గ్రామంలో ఓ పిల్లాడు ఉండే వాడు' అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఓ క‌థ చెప్పి అంద‌ర్నీ న‌వ్వించారు. ఈ క‌థ ద్వారా కాంగ్రెస్ నాయ‌కుల తీరును ఆయ‌న విమ‌ర్శించారు. ఈ రోజు నారాయణ్‌పేట్ లో నిర్వ‌హించిన ఓ బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయ‌కులు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కొట్టార‌ని అన్నారు. ఎలా, ఎందుకు కొట్టారో వివ‌రిస్తూ క‌థ చెప్పారు.

ఓ గ్రామంలో ఓ పిల్లాడు ఉండే వాడని, అత‌డికి లేని చెడు అల‌వాటు లేద‌ని అన్నారు. త‌న తీరును ప్రశ్నించిన‌ తల్లిదండ్రుల‌ను బాగా తాగిన మైకంలో రోకలబండతో కొట్టి చంపేశాడ‌ని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అత‌డిని అరెస్టు చేసి జూపల్లి కృష్ణారావు లాంటి జడ్జి ముందుకు తీసుకెళ్లారని అన్నారు. దీంతో ఆ పిల్లాడిని జ‌డ్జి ఎగాదిగా చూసి, ఎన్నో దిక్కుమాలిన కేసులు చూసినగానీ ఇటువంటి కేసులో ఎప్పుడూ తీర్పు చెప్పలేదని అన్నాడని చెప్పారు.

ఇక జ‌డ్జి ఆ పిల్లాడిని నీకు ఎటువంటి శిక్ష వేయాల‌ని అడిగాడని, దానికి ఆ పిల్లాడు తల్లిదండ్రులు లేని అనాథని వ‌దిలేయండ‌ని కోరాడని క‌థను ముగించారు. కాంగ్రెస్ నాయ‌కుల తీరు కూడా ఆ పిల్లాడిలానే ఉంద‌ని, 60 ఏళ్లపాటు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కొట్టింది కాంగ్రెస్‌ వాళ్లు కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్పుడు తమకు ఏ పాపం తెలియదన్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News