: విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుతారనే విశ్వాసం వుంది!: 'ఎస్ఆర్ఎం' ప్రారంభోత్సవంలో వెంకయ్య నాయుడు

నవ్యాంధ్ర రాజధాని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన తొలి విశ్వ‌విద్యాల‌యం ఎస్‌ఆర్‌ఎం వ‌ర్సిటీని ఈ రోజు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు మాట్లాడుతూ... రాజధానిలో తొలి వర్సిటీ ఏర్పాటుకావడం ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధికి కృషి చేస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆయ‌న అభినందించారు. విద్యకు అధిక‌ ప్రాధాన్యతనిచ్చే భార‌త్‌లో తెలివికి కొదవలేదని వ్యాఖ్యానించారు. భార‌త్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంద‌ని, దేశాన్ని శక్తిమంతంగా తయారుచేసుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కేంద్ర స‌ర్కారు తరఫున అభినందనలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ రోజు అక్క‌డ ఏర్పాటు చేసిన వర్సిటీకి విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి చదువుతారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు.    

More Telugu News