: రాష్ట్రపతిగా మళ్లీ మీ ముందుకు రాలేను: సొంత ప్రాంత ప్రజలతో ప్రణబ్ ముఖర్జీ
`రాష్ట్రపతిగా నా పదవీకాలం మరో పదిరోజుల్లో ముగుస్తుంది. ఇక రాష్ట్రపతిగా మళ్లీ మీ ముందుకు వచ్చి మాట్లాడలేను` అని పశ్చిమ బెంగాల్లోని జంగీపూర్ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభమైంది జంగీపూర్ ప్రాంతం నుంచే అని ఆయన గుర్తుచేసుకున్నారు. జంగీపూర్లోని మెకంజీ ఫుట్బాల్ మైదానంలో కేకేఎం గ్రామీణ టోర్నమెంట్ ప్రారంభించడానికి ఆయన అక్కడికి వెళ్లారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ - 'ఇక నుంచి తాను కూడా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒకణ్ణి... సాధారణ మనిషిని' అన్నపుడు మైదానం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. అలాగే జంగీపూర్లో తాను నివసించిన గృహాన్ని సందర్శించటంతో పాటు, అక్కడ ఉన్న తన చిన్ననాటి స్నేహితులను రాష్ట్రపతి కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ జంగీపూర్ ప్రజలతో రాష్ట్రపతి ముచ్చటించారు.