: దమ్ముంటే మీ మహిళలను పశ్చిమబెంగాల్‌ పంపండి.. అత్యాచారాలకు గురి కాకుండా వుంటే అప్పుడు చెప్పండి!: రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు!

భారతీయ జనతాపార్టీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ఆందోళన, హింస నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం మమతను, కాంగ్రెస్‌ను పొగుడుతున్న వారు దమ్ముంటే తమ మహిళలను 15 రోజులపాటు రాష్ట్రానికి పంపాలని సవాల్ విసిరారు. వారు అత్యాచారానికి గురికాకుండా ఉంటే కనుక అప్పుడు తనకు చెప్పాలని ఆమె అన్నారు.

మమత ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను పొగుడుతున్న అందరికీ ఇదే తన సవాలని నొక్కి చెప్పారు. ‘‘మీ కూతుళ్లు, కోడళ్లు, భార్యలను బెంగాల్ పంపండి.. మమత ఆతిథ్యం తీసుకోకుండా, 15 రోజులు అక్కడే ఉండి అత్యాచారానికి గురి కాకుండా వస్తే నాకు చెప్పండి’’ అని పేర్కొని కలకలం రేపారు. బషిర్‌హట్‌లో మత కల్లోలాలు, ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమంతో పశ్చిమ బెంగాల్‌లో హింస పెచ్చరిల్లింది. దీనిని ఉద్దేశించి రూపా గంగూలీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయిందని ఆమె ఆరోపించారు.

More Telugu News