: విమానాలనూ వదలని కలుషిత పెట్రోలు... టేకాఫైన కాసేపటికే అత్యవసరంగా ల్యాండైన విమానాలు!

బంకుల్లో పెట్రోలు కలుషితమవడం సాధారణ విషయం. కానీ ఏకంగా విమానాల్లో ఉపయోగించే పెట్రోలు కూడా కలుషితం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఆ పెట్రోలు కొట్టించుకుని ఎగిరిన విమానాలు అత్యవసరంగా ల్యాండైన ఘటన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  చోటుచేసుకుంది. ఈనెల 7న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెండు దేశీయ విమానాలు టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగి విమానాశ్రయంలో ల్యాండయ్యాయి. పెట్రోలు కొట్టించుకుని ఎగిరిన విమానాల్లోని వ్యవస్థ ఫ్యూయల్ గురించి హెచ్చరించడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఫ్యూయల్ ట్యాంకులను ఖాళీ చేసి పరిశీలించగా పెట్రోలులో నీళ్లు కలిసిన విషయాన్ని గుర్తించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు అధికారులు నిరాకరించారు.

అయితే పౌర విమానయాన శాఖ మాత్రం పెట్రోలు కలుషితంపై విచారణకు ఆదేశించింది. ఇండియన్ ఆయిల్ ఏవియేషన్ సర్వీస్ జెట్ ఫ్యూయల్ అందించే అతిపెద్ద సంస్థ. రోజుకు 1750 విమానాలకు ఇది పెట్రోలు అందిస్తుంది. విమానాలకు అందించే పెట్రోలుపై రోజంతా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. 15 క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబొరేటరీల్లో నిరంతరం పెట్రోలను పరీక్షిస్తూ ఉంటారు. అయినప్పటికీ పెట్రోలులో నీళ్లు కలవడంపై విమానాశ్రయ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News