: ఎవరికీ డ్రగ్స్ అలవాటు లేదట, అందరూ విచారణకు సహకరిస్తారట!: నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు

తెలుగు సినీ ప్రముఖుల్లో డ్రగ్స్ దందాలో చిక్కుకుని, పోలీసుల నుంచి విచారణకు రావాలని నోటీసులు అందుకున్న వారిలో పలువురు మీడియా ముందుకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మీడియా ముందుకు వచ్చిన వారంతా, డ్రగ్స్ వాడకంతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని, తప్పుగా తమను ఇరికించారని చెబుతూనే, నోటీసులు అందాయని, పోలీసులకు సహకరిస్తామని చెబుతుండటం గమనార్హం. హీరో నవదీప్, తనీష్, గాయని గీతా మాధురి భర్త నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజు తదితరులు వివిధ టీవీ చానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.

చిన్నా మాత్రం తనకు ఇప్పటివరకూ నోటీసులే అందలేదని, తనకు సిగరెట్ అలవాటు కూడా లేదని చెబుతుండగా, మిగతా వారు మాత్రం నోటీసులు వచ్చినట్టు స్పష్టం చేశారు. నవదీప్ మినహా మిగతా వారంతా తమకు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లూ లేవని, అరెస్టయిన కెల్విన్ తదితరులు పరిచయం కూడా లేదని చెప్పుకొచ్చారు. నవదీప్ మాత్రం కెల్విన్ తో ఈవెంట్ మేనేజ్ మెంట్ పరిచయం ఉందని, గతంలో కొన్ని తప్పులు చేసినా, ఇప్పుడు అటువంటి పనులు మానేశానని చెప్పాడు.

ఇదే కేసులో నోటీసులు అందుకున్నారని భావిస్తున్న పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మీ, ముమైత్ ఖాన్ ల నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. ఇక ఈ కేసులో తొలి జాబితా సినీ ప్రముఖులను విచారించిన తరువాత, మరిన్ని పేర్లు తెరపైకి రావచ్చని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News