: నితీశ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుంది: రామచంద్ర గుహ సెటైర్లు!

బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీపై ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,  కాంగ్రెస్ పార్టీకి నితీశ్ ను అధ్యక్షుడిగా చేయాలని రామచంద్రగుహ ఓ సూచన చేశారు. నాయకత్వం లోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు రావాలన్నా, ప్రజాదరణ సాధించాలన్నా నితీశ్ ను ఆ పార్టీ అధ్యక్షుడిగా చేయాలని అన్నారు. స్నేహ పూర్వక వాతావరణంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన స్వీకరిస్తే బాగుంటుందని సెటైర్లు విసిరారు.

కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేడని, నితీశ్ కు సరైన పార్టీ లేదు కనుక ఆ విధంగా చేస్తే బాగుంటుదంటూ తనదైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు కష్టమేనని, భారత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం సాధ్యపడకపోవచ్చని రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈ మధ్యలో ఏమైనా మార్పులు సంభవించే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఏక పార్టీ వ్యవస్థ ఎప్పుడైనా దేశానికి ప్రమాదరకరమని, నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో తేలిందని, గడచిన డెబ్భై ఏళ్లలో తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి మూడు రాష్ట్రాలు రెండు పార్టీల పాలనలోనే నడిచాయని, ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయని అన్నారు. ఏళ్ల తరబడి ఏక పార్టీ పరిపాలన కొనసాగిన పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదని అన్నారు.

More Telugu News