: కృష్ణా జిల్లాలో 9వ తరగతి బాలిక మృతి... ఆత్మహత్యా? హత్యా?

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఊహలు రెక్కలు తొడగని వయసులోనే ఒక మైనర్ బాలుడు, మరో మైనర్ బాలికపై ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడడం, ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పెను కలకలం రేపుతూ, ఆలోచింపజేస్తోంది. పిల్లలపై నియంత్రణ లేకపోయినా, నియంత్రణ ఎక్కువ ఉన్నా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఈ ఘటన సూచిస్తోంది. నాని అనే మైనర్ బాలుడు విజయవాడ, పటమటలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సౌమ్యను ప్రేమ పేరుతో ఏడాదిన్నర కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. స్కూల్ సమీపంలోని బేకరీ నుంచి ఇంటికి వచ్చేంత వరకు స్నేహితులతో కలిసి సౌమ్యను అల్లరి చేసేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో జరిగిన ఆమె మృతి అనుమానాస్పదనగా మారింది.

తొలుత దీనిని ఆత్మహత్య అని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నప్పటికీ, పోస్టు మార్టం సమయంలో ఆమె చెవుల నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లతో పాటు, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండడం కూడా ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు సౌమ్య చెల్లెలు మాట్లాడుతూ, తన అక్కను నాని కొట్టాడని చెబుతోంది. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.  

More Telugu News