: మహారాష్ట్ర మహిళా జైలు సిబ్బందిపై లైంగిక వేధింపులు.. తమతో సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న సీనియర్లు.. కలకలం సృష్టిస్తున్న లేఖ!

తమతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సీనియర్లు వేధిస్తున్నారంటూ మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ ఇప్పుడు మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్ గోరేకు లేఖ రాశారు. దీనిని ఆమె ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేసి విచారణ జరిపించాలని కోరారు.

అయితే గోరేకు తాను ఎటువంటి లేఖ రాయలేదని ఎస్పీ పేర్కొనడం గమనార్హం. తనకు అందిన లేఖలో సీనియర్లు తమను లైంగికంగా ఎలా వేధిస్తున్నదీ, సంబంధం కోసం ఎలా ఒత్తిడి తీసుకొస్తున్నదీ వివరంగా ఉందని గోరే తెలిపారు. లేఖలోని నిజాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించానని, అయితే ఆమె తనకు లేఖ రాసిన విషయాన్ని ఖండించారని పేర్కొన్నారు. దీంతో ఆమెపై ఎవరి ఒత్తిడో పనిచేస్తున్న విషయం అర్థమవుతోందన్నారు. ఆమె లేఖలో నిజముందని, ఆ విషయం తేల్చేందుకు విచారణ జరిపించాలని కోరారు. తాజా తేదీతో రాసిన ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సీనియర్ అధికారి ఒకరు తనతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారని లేఖలో ఫిర్యాదుదారు ఆరోపించారు. ఇప్పుడీ లేఖ మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

More Telugu News