: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడిని ఖండించిన అమెరికా.. పిరికిపందల చర్యగా వర్ణన.. ఉగ్రవాదం అంతు చూస్తామని ప్రతిన!

అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అమెరికా అభివర్ణించింది.  ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఉగ్రవాదంపై అమెరికా-భారత్‌లు కలిసి పోరాడతాయని పేర్కొంది. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మతస్వేచ్ఛపై దాడి అంటే ప్రాథమిక హక్కులపై దాడి జరిగినట్టేనని పేర్కొంది. ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాదం ఏమూలన ఉన్నా అమెరికా, భారత్‌లు కలిసి పోరాడతాయని పేర్కొంది.

అంతకుముందు అమెరికా రాయబార కార్యాలయం కూడా అనంత్‌నాగ్ ఉగ్రదాడిని ఖండించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అమర్‌నాథ్ యాత్రికులపై దాడిని ఖండించారు. దాడిని దుశ్చర్యగా పేర్కొన్న ఆమె, ప్రధాని మోదీకి లేఖ రాస్తూ ఇటువంటి కష్ట సమయంలో తమ దేశం భారత్‌కు తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, భారత్‌లో బ్రిటన్‌ హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అలెగ్జాండర్ ఎవాన్స్ తదితరులు కూడా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు తమ సానుభూతి తెలిపారు.

More Telugu News