: తప్పు భారత్ దే...భారత్ దళాలు వెనక్కు మళ్లాలి!: మరోసారి చైనా డిమాండ్

డోక్లామ్ సరిహద్దుల నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని చైనా భారత్ కు సూచించింది. శీతాకాలంలో డోక్లామ్ సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అందుకు ఇంకా సమయం వున్నప్పటికీ, ఇప్పటి నుంచే ఆ పరిస్థితులను తట్టుకునేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మరింత మంది సైనికులను పంపడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టమైన సంకేతాలు పంపింది.

ఇదే సమయంలో చైనాతో గతంలో ఏర్పడిన సరిహద్దు వివాదాలు ఎప్పటికప్పుడు చర్చల ద్వారా పరిష్కారమయ్యాయని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షువంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌, చైనా, భూటాన్‌ సరిహద్దుల్లోని ట్రైజంక్షన్‌ నుంచి భారత దళాలు వెనక్కు మళ్లాలని అన్నారు. డోక్లామ్‌ లో భారతదళాలు ఆక్రమణకు దిగాయని ఆయన ఆరోపించారు. గతంలో భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని, అయితే డోక్లామ్‌ లో మాత్రం ఇప్పుడు భారతదళాలు చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని ఆయన విమర్శించారు. భారత్‌ లోని సిక్కింతో చైనా సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే డోక్లామ్‌ విషయంలో భారత్‌ మరోసారి సమీక్ష నిర్వహించి వెంటనే వెనక్కు వెళ్లాలని ఆయన సూచించారు.

More Telugu News