: నంద్యాలలో భయపెడుతున్నారు.. అయినా గెలుపు మాదే!: బొత్స

అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలలో అరాచకాలకు పాల్పడుతోందని... టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంట్లో అర్ధరాత్రి సోదాలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బరాయుడుని ఈ రోజు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్యలు కలిశారు.

అనంతరం బొత్స మాట్లాడుతూ, టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని... అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. రోజుకో హామీతో నంద్యాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని... ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో వైసీపీదే గెలుపు అని అన్నారు.

More Telugu News