: కాపురాల్లో చిచ్చు పెడుతున్న ట్రాఫిక్ ఈ- చలాన్లు!

ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇటీవలే ఈ తరహా సంఘటన ఒకటి జరిగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే చలాన్లు ఇంటికి వస్తాయన్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ పట్టణంలో ఇటీవలే ఓ వ్యక్తి ఇంటికి చలానా రాగా, ద్విచక్ర వాహనంపై తనకు బదులు మరో మహిళ ఉండడాన్ని సదరు వ్యక్తి భార్య గుర్తించింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను మోసం చేస్తున్నాడంటూ ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త బైకుపై ముఖానికి దుపట్టా ధరించి కూర్చున్న మహిళ ఎవరో తేల్చాలని ఆమె పోలీసులను ప్రాధేయపడింది.

ఈ ఫొటోను హంకలేశ్వర్ సర్కిల్ లోని సీసీటీవీ కెమెరాలు బంధించాయి. ఆ ప్రాంతంలో తమకు ఎవరూ బంధువులు లేరని కూడా పోలీసులను ఆశ్రయించిన వివాహిత తెలిపింది. కాగా, తనకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని ఈ చలానాకు కారణమైన వ్యక్తి పేర్కొనడం కొసమెరుపు. తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగినికి లిఫ్ట్ ఇచ్చానని అతడు పోలీసులకు వివరణ ఇచ్చుకున్నాడు. పోలీసులు మాత్రం అతడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫోటోల కారణంగా చాలా వివాహేతర సంబంధాలు బయటకు వస్తున్నాయని పోలీసులు చెప్పడం గమనార్హం.

More Telugu News