: ఆ 15 మంది సినీ నటులకు నేను చెప్పేది ఇదే!: అల్లు అరవింద్

తెలంగాణ పోలీసులు డ్రగ్స్ మాఫియాపై అద్భుతంగా చర్యలు తీసుకుంటున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'సినీ పరిశ్రమలో 15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ 15 మందికి నేను చెప్పేది ఏంటంటే... మీరు అచ్చం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్టు వ్యవహరిస్తున్నారు. మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికీ తెలియదని భావిస్తున్నారు. కానీ అది పొరపాటు. మీకు సంబంధించిన ప్రతి అంశం ప్రభుత్వం ముందు ఉంది. డ్రగ్స్ ఎప్పుడు? ఎక్కడ? ఎవరి వద్ద? ఎలా? తీసుకున్నారన్న ప్రతి రికార్డు వారి వద్ద వుంది" అన్నారు.

అయితే కేవలం మీ భవిష్యత్ నాశనం చేయకూడదన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని పోలీసులు ఉపేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికి అయిందేదో అయిపోయిందని, ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అరవింద్ సూచించారు. సినీ పరిశ్రమలో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని, అలా కాకుండా సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెచ్చి, సమాజానికి కీడుగా మారితే తీవ్రంగా నష్టపోయేది మీరేనని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముంబైలో రేవ్ పార్టీలో ఒక పది లేక పదిహేను మంది చేసే పనులను ఇక్కడ చేస్తామంటే కుదరదని గుర్తించాలని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే అక్కడి నుంచి తప్పుకోవాలని ఆయన తీవ్రంగా సూచించారు.

More Telugu News