: జీఎస్టీ ఎఫెక్ట్: జూన్ లో పెరిగిన బంగారం దిగుమతులు

జూన్ నెలలో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుండడంతో జూన్ నెలలో ఆభరణాల కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపించారు. అటు ఆభరణాల వర్తకులు సైతం నిల్వలు పెంచుకున్నారు. దీంతో గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ లో దిగుమతులు మూడు రెట్లు పెరిగిపోయాయి. జూన్ నెలలో సుమారు 75 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అయింది.

2016 జూన్ లో దిగుమతైన బంగారం 22.7 టన్నులే. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దిగుమతులు 514 టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది తొలి ఆరు నెలల కంటే ఇది 161 శాతం అధికం. ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. జీఎస్టీలో బంగారంపై 3 శాతం పన్నేయడంతో ఆ భారం నుంచి తప్పించుకునేందుకు వినియోగదారులు జూన్ నెలలో కొనుగోలు చేయడమే డిమాండ్ పెరగడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు.

More Telugu News