: ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన మోసుల్.. అపహరణకు గురైన భారతీయుల గురించి అన్వేషణ!

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల చెర నుంచి ఇరాక్‌లోని మోసుల్‌కు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించాయి. నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై జరుగుతున్న పోరులో ఇదో చారిత్రక ఘట్టంగా చెబుతున్నారు. కాగా, గతంలో అపహరణకు గురైన భారతీయుల గురించి ఇప్పుడు మోసుల్‌లో అన్వేషణ మొదలైంది. 2014లో 39 మంది భారతీయ నిర్మాణ రంగ కార్మికులను ఉగ్రవాదులు ఇరాక్ నగరం నుంచి అపహరించారు. వారి జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు.

కేంద్ర మంత్రి వీకే సింగ్ సోమవారం సాయంత్రం ఎర్బిల్ చేరుకుని భారతీయ కార్మకుల గురించి ఆరా తీశారు. మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రధాని ప్రకటించగానే కనిపించకుండా పోయిన భారతీయులను గుర్తించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు ప్రారంభించినట్టు విదేశాగంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగ్లే తెలిపారు. వారిని వెతికి సురక్షితంగా వెనక్కి రప్పించడమే తమ ప్రధాన విధి అని, ఇందుకోసం ఇరాక్‌లో  భారత రాయబారి, కాన్సుల్ జనరల్ ఎర్బిల్‌లు తమ ప్రయత్నాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు.

అపహరణకు గురైన 39 మంది భారతీయులను కనుగొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు హామీ ఇచ్చారు. అపహరణకు గురైన వారిలో అత్యధికులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఈ విషయంలో సుష్మ జోక్యం చేసుకోవాలని సీఎం కోరడంతో ఆమె పై విధంగా స్పందించారు.

More Telugu News