: హలో... దానిపై సచివాలయంలో మాట్లాడదాం, ఇక్కడ స్క్రిప్టు ఐటీ, ఎలక్ట్రానిక్స్ మాత్రమే!: మీడియాతో లోకేశ్

ఈ ఉదయం నవ్యాంధ్రలో ఒకేసారి ఏడు కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలను ప్రారంభించిన సమయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ప్రసంగాల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వేళ, నిన్నటి వైకాపా ప్లీనరీలో చేసిన విమర్శలపై ప్రశ్నించబోగా, "హలో, సచివాలయంలో మాట్లాడదాం. ప్లీజ్... ఇక్కడ స్క్రిప్టు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే" అన్నారు.

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకూ ఏపీలో 36 ఐటీ కంపెనీలను ప్రారంభించామని తెలిపారు. వీటి ద్వారా 3,684 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. కొత్త కంపెనీలతో మరో 280 మందికి ఉద్యోగాలు రానున్నాయని, ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు టెక్నాలజీ, ఫైనాన్షియల్ పాలసీని తెచ్చామని తెలిపారు. పెళ్లి వంటి శుభకార్యాలు తలపెట్టినా కూడా, వాటిని అడ్డుకునే వారుంటారని, తాము ప్రారంభిస్తున్న ఐటీ కంపెనీలనూ విపక్షాలు అడ్డుకునేందుకు చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అడిగిన వెంటనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని అన్నారు.

More Telugu News