: 'జబర్దస్త్'పై రామోజీరావును ఎందుకు అడగరు?: రోజా సూటి ప్రశ్న

ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ, వైకాపా ఎమ్మెల్యే రోజా, తాను జడ్జిగా ఉన్న 'జబర్దస్త్' కార్యక్రమంలో బూతు డైలాగులు, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు ఉన్నాయని వస్తున్న విమర్శలపై స్పందించారు. "నేను అడుగుతున్నాను. అది ఈటీవీలో వస్తుంది. ఈరోజు నన్ను మాట్లాడిన మాటలు రామోజీరావును ఎందుకు అడగట్లేదు, ఆ తెలుగుదేశం వాళ్లు గానీ, మీరుగానీ... మేము అక్కడ కేవలం జడ్జస్ గా కూర్చున్నాం. జరిగిన దానికి మేము నవ్వినా, నవ్వకపోయినా... నవ్వే షాట్ వారు వేసుకుంటారన్న సంగతి మీకు తెలుసు. ఎంటర్ టెయిన్ మెంట్ షో అంటే మీకు తెలుసు. అదేమీ రియాల్టీ షో కాదు. మరి అలాంటి ఓ కామెడీ షోలో, అందరినీ వదిలేసి రోజాను టార్గెట్ చేయడమంటే, రోజాను చూసి భయపడుతున్నట్టే. నేనెక్కడా బూతు డైలాగులు చెప్పలేదు. నేనేమీ ఎడిటింగ్ చేయను. అందుకు సెన్సార్ బోర్డు ఉంది. నాపై విమర్శలు కడుపుమంటతో మాట్లాడుతున్నవే. ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు సెన్సార్ బోర్డుకు చెప్పకుండా మీరేం చేస్తున్నారు?" అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ రోజు ఇటువంటివి ఎన్నో షోలు ఉన్నాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని, కేవలం తనపై మాత్రమే విమర్శలు చేయడం కోడిగుడ్డుపై ఈకలు పీకడం వంటిదేనని, తననెవరూ ఏమీ చేయలేరని దుయ్యబట్టారు. అది విజయవంతమైన షో కాబట్టే, నాలుగేళ్ల నుంచి నడుస్తోందని, దానికి పోటీగా వచ్చిన ఎన్నో షోలు పది రోజులకే ఆగిపోయాయని అన్నారు. ఎక్కడో ఏదో మాట్లాడారంటూ, భూతద్ధంలో వెతికి దాన్ని రోజాకు అంటగట్టాలని చూస్తుంటే, తానేం చెప్పలేనని అన్నారు. అది ఒక తప్పుడు షో అయితే, రామోజీరావు దాన్ని ఎంకరేజ్ చేయరని, ఈటీవీకి ఉన్న బ్రాండ్ అటువంటిదని, అదే షో తప్పయితే, శ్యాంప్రసాద్ రెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీయరని స్పష్టం చేశారు.. జడ్జీలుగా ఉన్న మేమేం చిన్నపిల్లలం, రోడ్లపై నుంచి వచ్చిన వాళ్లం కాదని, ఓ స్టేటస్ ఉన్నవాళ్లమేనని ఘాటుగా చెప్పారు.

More Telugu News