: జగన్ ను అణగదొక్కడం చంద్రబాబు జేజమ్మ తరం కూడా కాదు: కొలుసు పార్థసారథి

తమ పార్టీ అధినేత జగన్ ను అణగదొక్కడం చంద్రబాబు జేజమ్మ తరం కూడా కాదంటూ వైసీపీ నేత కొలుసు పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధానిని టీడీపీ, సింగపూర్ రాబందులకు చంద్రబాబు అప్పగించారని, మూడేళ్ల పాలనలో బాబు చేసిందని శూన్యమని విమర్శించారు. కోట్లు సంపాదించడం, హత్యా రాజకీయాలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారని, జగన్ సీఎం అయ్యాక అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని, సుపరిపాలన అందించి చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటామని, ఇసుక దందాతో టీడీపీ నేతలు వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

ఆ పాపపు సొమ్ముతోనే ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని, ఓటుకు రూ.5 వేలు ఇస్తానని నంద్యాలలో బహిరంగంగా చెప్పారని, చంద్రబాబుకు ఏమాత్రం నీతి, నిజాయతీ లేవని, తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. బాబుకు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ సీఎం కావడం ఖాయమని పార్థసారథి జోస్యం చెప్పారు.

More Telugu News