: సోదరుడి బాటలోనే... వైసీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి?

నంద్యాల ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ టికెట్ లభించలేదన్న కినుకతో వైకాపాలో చేరిపోయి, టికెట్ సంపాదించుకున్న శిల్పా మోహన్ రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా నడవనున్నారా? ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి త్వరలోనే వైకాపాలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన సుముఖతతో లేరని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నంద్యాల ప్రచార బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. సోదరుడి గెలుపు కోసం ఆయన తనవంతు పాత్రను పోషిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయనకు ఆహ్వానం అందలేదు. ఈ మొత్తం వ్యవహారం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారే విషయమై శిల్పా చక్రపాణిరెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడకున్నా, ఆయన పార్టీని వీడటం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.

More Telugu News