: సినీ దర్శకుడు రాఘవేంద్రరావుపై హీరోయిన్ తాప్సీ వెకిలి వ్యాఖ్యలు.. మండిపడుతున్న అభిమానులు!

త‌న‌ను సినీ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన టాలీవుడ్‌పై, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు వంటి వ్య‌క్తిపై హీరోయిన్ తాప్సీ విప‌రీత వ్యాఖ్య‌లు చేసింది. వెకిలి న‌వ్వులు న‌వ్వింది. స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తోన్న ఏదో సామాజిక రుగ్మ‌త మీద మాట్లాడుతున్న‌ట్లు మాట్లాడి టాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌కు, అభిమానుల‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఓ షోలో పాల్గొన్న ఆమె... రాఘ‌వేంద్ర రావు లాంటి గొప్ప ద‌ర్శ‌కుడిపై వ్యాఖ్య‌లు చేస్తోంటే ఆమె ప‌క్కన ఉన్న ఇత‌ర బాలీవుడ్ న‌టులు వెక్కిరింపుల ధోర‌ణితో న‌వ్వారు. ఏదో ఓ కామెడీ క‌థ చెబుతున్న‌ట్లు తాప్సీ టాలీవుడ్‌పై, ద‌ర్శ‌కేంద్రుడిపై త‌న స్థాయి మ‌ర‌చి మ‌రీ సెటైర్లు వేసింది.

తాప్సీని ‘ఝమ్మంది నాదం’ చిత్రం ద్వారా రాఘ‌వేంద్ర‌రావు తెలుగు తెరకు పరిచయం చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో త‌న బొడ్డుపై పూలు, పండ్లు, కొబ్బ‌రికాయ‌లు విసిరారంటూ తాప్సీ హేళ‌న‌గా మాట్లాడింది. తన మొదటి సినిమా డైరెక్టర్‌ తీరుతో త‌న‌కు భయమేసిందని వ్యాఖ్యానించింది. హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు విసిరే రాఘ‌వేంద్ర‌రావు వంటి డైరెక్టర్‌తో శ్రీదేవి, జయప్రద లాంటి వారు కూడా నటించారని తెలిపింది. తన‌పై మాత్రం తొలిరోజే టెంకాయ‌ విసిరారని గ‌ట్టిగా న‌వ్వింది. స్క్రీన్‌పై ఆ సినిమాలోని ఓ పాట‌ను చూపిస్తూ హేళ‌న చేసింది.

అస‌లు ద‌క్షిణాది సినిమాల్లో హీరోయిన్స్‌ను కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం చేస్తారని ఆమె తీవ్ర ఆరోపణ చేసింది. ఇటీవ‌లే ఆమె బాలీవుడ్‌లో పింక్, నామ్ షబానా వంటి సినిమాలు చేసింది. అవి మంచి విజ‌యం సాధించ‌డంతోనే గర్వం వచ్చి, ఆమె తెలుగు సినిమాపై ఇటువంటి వ్యాఖ్య‌లు చేసిందని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. తాను చేసిన ఈ రెండు సినిమాలు చూసిన ద‌క్షిణాది ప్రేక్ష‌కులు త‌న‌కు యాక్టింగ్ కూడా వస్తుందా? అంటూ ఆశ్చర్యపోయారని మరో కామెంట్ చేసింది. ఈ షోకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారుతోంది.

More Telugu News