: హైదరాబాద్ లో దారుణం.. భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య!

భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య చివరకు ఆయనను కిడ్నాప్ చేయించిన ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. ఎట్ట‌కేల‌కు ఈ కేసును ఛేదించిన పోలీసులు ఈ రోజు మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. బల్కంపేటలోని సైంటిఫిక్‌ కాలనీలో భానుప్రసాద్‌, ప్ర‌స‌న్న కుమారి దంప‌తులు నివ‌సిస్తున్నారు. వ్యాపారవేత్త అయిన‌ భానుప్రసాద్ అవ‌స‌రాల‌కు గానూ పలువురి వద్ద భారీగా అప్పులు చేస్తున్నాడు. అయితే, త‌న భర్త ప‌రాయి స్త్రీల‌ మోజులో ప‌డి ఇలా అప్పులు చేస్తూ వారికి ఇస్తున్నాడా? అని ప్ర‌స‌న్నకుమారిని అనుమానం వెంటాడింది. దీంతో ఆయ‌న చేస్తోన్న ఖ‌ర్చుల గురించి ఎలాగైనా వివరాలు తెలుసుకోవాల‌నుకుంది.

తన భర్తకు వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయా? అనే విష‌యాన్ని కూడా రాబ‌ట్టాల‌నుకుంది ప్రసన్న కుమారి. తనకు తెలిసిన‌ ఎన్‌సీసీ కోచ్‌ మునిగళ్ల ప్రవీణ్‌కుమార్‌, ఎంబీఏ విద్యార్థి రాజబోయిన విశాల్‌ యాదవ్‌లతో క‌లిసి ఓ స్కెచ్ వేసింది. ఆ ఇద్దరూ ప‌ది రోజు క్రితం ఉదయం భానుప్రసాద్‌ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. భానుప్రసాద్‌ను ఓ గదిలో నిర్బంధించి, తీవ్రంగా హింసించారు. ఎవ‌రెవ‌రితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నావ్‌? అంత‌ డ‌బ్బు  ఏం చేస్తున్నావు? అంటూ కొడుతూ నిల‌దీశారు.

ఆ దెబ్బ‌ల‌కు తాళ‌లేక భానుప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో భాను ప్ర‌సాద్‌ను వారు కారులో ఇంటికి తీసుకెళ్లి ఆయ‌న భార్య‌కు అప్ప‌గించారు. ఆ తర్వాత స్పృహ‌లోకి వ‌చ్చిన‌ భానుప్రసాద్ త‌నను కిడ్నాప్ చేసిన వారు త‌న‌ భార్య‌తో పాటు ఉన్నార‌ని తెలుసుకొని, పోలీసులను ఆశ్రయించాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.  

More Telugu News