: భారత్ కు కనిపించేలా ప్రపంచంలో 8వ అతిపెద్ద జెండాను ఎగరేయనున్న పాకిస్థాన్

భారత్ లోకి కనిపించేలా వాఘా సరిహద్దుల్లో అతిపెద్ద జెండాను ఎగురవేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. వాఘా బార్డర్ వద్ద 400 అడుగుల ఎత్తున జెండాను నిలపాలని నిర్ణయించి, ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రపంచంలోనే ఇది ఎనిమిదవ అత్యంత ఎత్తయిన దేశపతాకంగా నిలుస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించిన పాక్, ఆ ప్రాంతంలో అడ్డుగా ఉన్నాయని భావిస్తున్న చెట్లను నరికిస్తోంది.

 కాగా, ఈ సంవత్సరం మార్చి 5న అట్టారీ వద్ద భారీ జెండాను భారత్ ప్రతిష్ఠించినప్పటికీ, పెనుగాలులు పతాకాన్ని చించివేశాయి. ఆపై ఐదుసార్లు జెండాను మార్చినా ఇదే జరిగింది. దీంతో కేవలం జెండా కర్ర మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది. ఈ జెండా లాహోర్ నుంచి చూసినా కనిపిస్తుందని ఇండియా అప్పట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పాక్ తాజా నిర్ణయం అమలై జెండా ఎగిరితే, అది అమృతసర్ వరకూ కనిపిస్తుందని తెలుస్తోంది.

More Telugu News