: సెల్ వినియోగదారులకు శుభవార్త... బ్యాటరీ అవసరం లేని ఫోన్ వచ్చేస్తోంది!

సెల్ ఫోన్ కనుగొన్న తరువాత సమాచారమార్పిడి సులభమైంది. దానికి మరిన్ని సాంకేతిక హంగులు ఏర్పాటు చేస్తూ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. అనంతరం సాంకేతిక విప్లవం కారణంగా స్మార్ట్ ఫోన్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పని ఏదైనా నిల్చున్న చోటునుంచే స్మార్ట్ ఫోన్ సాయంతో చేసేయడం అలవాటైపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ లో ప్రధాన సమస్య ఛార్జింగ్... దీనిని అధిగమించేందుకు ఎంతోకాలంగా జరుగుతున్న పరిశోధనలు ప్రతిఫలాన్నిచ్చాయి. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు బ్యాటరీ అవసరం లేని సరికొత్త స్మార్ట్ ఫోన్ ను తయారు చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్ లో విద్యుత్‌ వినియోగం దాదాపు శూన్యమని వారు చెబుతున్నారు. కొద్దోగొప్పో విద్యుత్ శక్తి అవసరమైనప్పటికీ అందుకు కావాల్సిన విద్యుత్ శక్తిని సెల్‌ ఫోన్‌ తనకు తానుగా తయారుచేసుకుంటుందని వారు చెప్పారు. దానిని రేడియో తరంగాల నుంచి గ్రహించేలా స్మార్ట్ ఫోన్ లో ఏర్పాట్లు చేశారు. కేవలం రేడియో తరంగాలే కాకుండా కాంతి తరంగాల నుంచి కూడా ఈ స్మార్ట్ ఫోన్ శక్తిని గ్రహించగలదని వారు తెలిపారు. ఈ పరిశోధకుల టీంలో భారతీయ సంతతికి చెందిన శ్యాం గుల్లకోట ఉండడం విశేషం. ఈ ఫోన్ అందుబాటులోకి వస్తే బ్యాటరీ అవసరం ఉండదని, దీంతో చార్జింగ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వారు తెలిపారు.

More Telugu News