: బాలీవుడ్ సినీ రచయిత చైన్ ను కొట్టేసిన దొంగ.. ఫేస్‌బుక్ సాయంతో పట్టుకున్న పోలీసులు

రూ. 7.6 లక్షల విలువ చేసే బంగారు గొలుసును తెంపుకెళ్లిన కేటుగాడిని ఫేస్‌బుక్ సాయంతో పోలీసులు ప‌ట్టుకున్న ఘ‌ట‌న ముంబైలో చోటు చేసుకుంది. గోరేగావ్ ‌కు చెందిన సినీ రచయిత జస్పాల్ కిషన్ సింగ్ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న మెడ‌లో ఉన్న ఓ బంగారు గొలుసుని గ‌మ‌నించిన ఓ దొంగ కిషన్ సింగ్ పై దాడి చేసి దాన్ని లాక్కెళ్ళాడు. దీంతో అటుగా వ‌చ్చిన పెట్రోలింగ్ పోలీసుల‌కు స‌ద‌రు ర‌చ‌యిత ఫిర్యాదు చేశాడు. దొంగ‌లు జ‌స్పాల్ పై దాడి చేసే స‌మ‌యంలో వారి మొబైల్ ఫోన్ కిందపడిపోయింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మొబైల్‌లో ఉన్న దొంగకు చెందిన ఫేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేశారు. దాని సాయంతో ఆ కేటుగాడి చిరునామాను కనుక్కొని తమిళనాడులోని విరుదునగర్ కు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్ సాయంతోనే తాము ఆ దొంగ‌ను ప‌ట్టుకున్నామ‌ని తెలిపారు.

More Telugu News