: ఖమ్మం గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడి అరెస్ట్.. వీడియో స్వాధీనం!

తెలంగాణలో పెను కలకలం రేపిన గ్యాంగ్ రేప్ నిందితుడ్ని ఖమ్మం పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం పట్టణంలో ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నానంటూ అఖిల్ అనే యువకుడు వెంటపడేవాడు. తరువాత సదరు యువతి పెళ్లి చేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని స్నేహితులతో పథకం రచించిన అఖిల్, తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటూ ఆమెను ఈ నెల 1న ఒక రూమ్ కి తీసుకెళ్లి తన ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. అంతే కాకుండా ఈ తతంగం మొత్తం వీడియోగా చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని హెచ్చరించి వదిలేశారు. అనంతరం 3వ తేదీన మళ్లీ ఆమె వద్దకు వచ్చి కోరిక తీర్చాలని దారుణానికి పాల్పడిన నలుగురూ వేధింపులకు దిగారు.

 దీంతో యువతి ధైర్యంగా జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే ఆమె తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 4న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడు ఖమ్మంలోని బస్ డిపో రోడ్డుకు చెందిన అఖిల్, కామేపల్లి మండలంలోని కెప్టెన్‌ బంజర గ్రామానికి చెందిన ఉదయ్‌, ఖమ్మం రూరల్‌ మండలం జలగంనగర్‌ కు చెందిన కార్తీక్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన రాధాకృష్ణలపై కిడ్నాప్‌, సామూహిక అత్యాచారం, పోక్సో చట్టాలపై కేసులు నమోదుచేసి, ఉదయ్, కార్తీక్, రాధాకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలియడంతో అఖిల్ తిరుపతిలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. తిరుపతిలో ఉన్న అఖిల్ ను అరెస్టు చేసేందుకు వెళ్లడంతో... పోలీసులు వస్తే బంధువుల ఇంట్లో పరువు పోతుందని తిరిగి ఖమ్మం చేరాడు. విషయం తెలిసిన పోలీసులు అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని నుంచి గ్యాంగ్ రేప్ వీడియోను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News