: ఏపీలో సినిమా టికెట్ల ధరలకు రెక్కలు... పెరిగిన ధరలకు జీఎస్టీ పోటు!

ఆంధ్రప్రదేశ్ లో సినిమా చూడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో సినిమా టిక్కెట్‌ ధరలు పెంపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్థిక, హోం, రెవెన్యూ శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు సమావేశమై టిక్కెట్‌ ధరల పెంపుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పట్టణాల్లోని సినిమాహాళ్లలో 75 రూపాయలుగా ఉన్న ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 100 రూపాయలకు పెరగనుంది. దీనికి జీఎస్టీ అదనంగా కలవనుంది.

ఈ లెక్కన టికెట్ ధర 118 రూపాయలు కానుంది. వాస్తవానికి ఆ టికెట్ ధరను 125 రూపాయలు చేయాలని చిత్రపరిశ్రమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే, టికెట్ ధర 100 దాటితే 28 శాతం జీఎస్టీ వేయాల్సి వస్తుందని, అది మరింత భారమవుతుందని భావించిన ప్రభుత్వం కేవలం 100 రూపాయలు చేసేందుకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. సాధారణ ధియేటర్ టికెట్ వంద అయితే, ఇక మల్టీప్లెక్స్ టికెట్ ధర ఇంకెంత పెంచాలి? అందుకే మల్టీప్లెక్స్ లలో రిక్లెయినర్ టికెట్ ధర 300 రూపాయలు చేయగా, ఇతర టికెట్ల ధర 200 రూపాయలుగా ఉండనుంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

More Telugu News