: తాడిపత్రి యువ‌తి లక్ష్మీ ప్రసన్నకు రూ.20 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురంలో రామసుబ్బారెడ్డి అనే వ్య‌క్తి మొన్న రాత్రి త‌న‌ భార్య సులోచన, కుమార్తెలు ప్రత్యూష, ప్రతిభలను దారుణంగా చంపేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం రామసుబ్బారెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తిరుపతిలో చదువుకుంటున్న రామసుబ్బారెడ్డి, సులోచన దంపతుల పెద్ద కూతురు లక్ష్మీ ప్రసన్న ఈ రోజు ఇంటికి వ‌చ్చింది. ఈ రోజు అనంత‌పురంలోనే ప‌ర్య‌టిస్తోన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని ఆ యువ‌తి మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి సాయంతో క‌లిసింది.

ఈ సందర్భంగా ఆమెకు చంద్ర‌బాబు నాయుడు రూ.20 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ఆ యువ‌తికి త‌ల్లిదండ్రులు లేని లోటును తాను తీరుస్తానని చెప్పారు. ఆమె చ‌దువుకి అయ్యే ఖ‌ర్చును కూడా భ‌రిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రసన్న మాట్లాడుతూ... తాను బాగా చ‌దువుకుని తన తల్లి తనను ఎలా చూడాలనుకుందో అలా అవుతాన‌ని చెప్పింది. త‌న తండ్రిలాంటి దుర్మార్గులు ఎక్క‌డా ఉండ‌కూడ‌ద‌ని పేర్కొంది. త‌న తల్లిని, చెల్లెల్ని త‌న తండ్రి దారుణంగా చంపేశాడ‌ని క‌న్నీరు పెట్టుకుంది.  

More Telugu News