: ఈ లక్షణాలు కనిపిస్తే...మీ పిల్లల్ని కౌన్సిలింగ్ కు తీసుకెళ్లండి: డీజీ అకున్ సబర్వాల్ సూచన

హైదరాబాదులో డ్రగ్స్ వినియోగిస్తూ స్కూలు పిల్లలు పట్టుబడడంపై ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ అంటే ఏంటో సరిగ్గా తెలియని వయసులో పిల్లలు అటువైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ప్రతితల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్కూల్ కు వెళ్లే పిల్లలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారంటే అనుమానించాలని సూచించారు. వారి చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం కొంత ప్రమాదకరమే అయినప్పటికీ దానిపై ఓ కన్నేసి ఉంచాలని అన్నారు.

ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కు దూరంగా గడుపుతూ ఇంటర్నెట్ ఛాటింగ్ లో ఎక్కువ సమయం గడుపుతుంటే ఆలోచించాలని సూచించారు. అలాగే సాధారణంగా పిల్లలు ఎంత తింటారు? ఏం తింటారు? అన్న విషయం ప్రతి తల్లిదండ్రులకు తెలుస్తుందని, ఒక్కసారిగా పిల్లలు తిండి తినడం తగ్గించారంటే అనుమానించాలని....అలాంటి వారిని జాగ్రత్తగా గమనించి, అనునయిస్తూ వారికర్థమయ్యేలా చెబుతూ నిపుణుల వద్దకు కౌన్సిలింగ్ కు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల అందమైన భవిష్యత్ తో పాటు వారిని కూడా నాశనం చేసినవారవుతారని ఆయన హెచ్చరించారు.

More Telugu News