: ఇక ఇండియాలో ఇన్వెస్ట్ మెంట్స్ వద్దు: నష్టపోతారని మల్టీ నేషనల్ కంపెనీలకు చైనా హెచ్చరిక

భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి యుద్ధ భయం నెలకొన్న వేళ, చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఇండియాలో పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులను తగ్గించుకోవాలని మల్టీ నేషనల్ కంపెనీలను చైనా హెచ్చరించింది. ఇండియా, చైనా మధ్య ఏ చిన్న సంఘటన జరిగినా, ఆస్తుల విధ్వంసం తప్పదని, ముఖ్యంగా చైనా ఆస్తులను భారతీయులు ధ్వంసం చేస్తారని అధికార 'గ్లోబల్ టైమ్స్' తన అక్కసును వెళ్లగక్కింది. ఇండియాలో అత్యధికులు జాతీయ భావాలను విశ్వసిస్తారని, చైనాకు వ్యతిరేకంగా వారి విశ్వాసాలు మారితే, అది చైనా పెట్టుబడులకు పెను విఘాతమవుతుందని పాత అనుభవాలను గుర్తు చేసింది.

అణు సరఫరాదారుల బృందంలో భారత్ ను చేరనీయకుండా చైనా అడ్డుకున్న వేళ, పలు చోట్ల చైనా జండాలను దహనం చేశారని గుర్తు చేస్తూ, ఇటువంటి చిన్న అంశాలు కూడా జాతీయ భావాలను కదిలిస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్, రిటైల్ రంగాల్లో చైనా ప్రొడక్టులు వాడవద్దని ప్రచారం సాగవచ్చని, దీని వల్ల చైనా కార్మికులకు, పెట్టుబడులకు భద్రత కరవవుతుందని పేర్కొంది. ఇండియాలో అవకాశాలకు కొదవ లేదని చెబుతూనే, పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణిలో ఉండాలని, కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటేనే మంచిదని తెలిపింది. చైనాకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగకుండా నరేంద్ర మోదీ సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఇండియాలో చైనా ఇన్వెస్ట్ మెంట్ రూ. 23 వేల కోట్లకు పైగానే ఉన్నాయి.

More Telugu News